K Laxman Demands Telangana Govt To Implement Rule Of Reservation: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ స్వాగతించారు. యూజీసీకి తన అభినందనలు తెలిపిన ఆయన.. అణగారిన వర్గాల సాధికారతకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి ఈ నిర్ణయం అనుగుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల.. దేశంలోని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాలేదని విమర్శించారు. ఇప్పుడు అలాంటి లోపాలను ప్రధాని మోడీ సవరిస్తున్నారని.. అందులో భాగంగానే డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని యూజీసీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అట్టడుగు వర్గాలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరిస్తుందని.. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్కి, యూజీసీకి కే. లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశారు. మన దేశంలో సుమారు 423 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 130 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని.. ఒక్కో యూనివర్సిటీ ప్రతి ఏడాది సగటును 3,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తే, మొత్తం 16 లక్షల మంది అడ్మిషన్ పొందుతున్నారని చెప్పారు. ఫలితంగా.. ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 8 లక్షల మంది విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోతున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యూజీసీ నిర్ణయానికి అనుగుణంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉన్న 10కి పైగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో సుమారు 30,000 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారని.. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 15,000 సీట్లు కోల్పోతున్నారని కే. లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం.. రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల సదుపాయాన్ని విస్మరించిందని మండిపడ్డారు. యూజీసీ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసేలా అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.