ప్రజలకు వ్యవస్థ పట్ల భాధ్యత లేనంత కాలం, కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేనంత కాలం ఎన్ని సంస్కరణలు చేసినా ప్రయోజనం లేదని సుప్రీం కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశంలో పోలీస్ సంస్కరణలపై మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ రాసిన ‘స్ట్రగుల్ ఫర్ పోలీస్ రాఫామ్స్’ పుస్తకంపై ఓయూ దూర విద్యా కేంద్రంలో చర్చా కార్యక్రమం జరిగింది. దీంట్లో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు.
దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ.. 40 ఏళ్లుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయని.. ఒక్క కేసు కూడా చట్టసభ సభ్యుల పదవీ కాలం ముగిసే వరకు కూడా పూర్తి కాలేదని జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతం వంటి వైషమ్యాలను వదిలి యువత ప్రశ్నించడం ద్వారానే ఈ దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆయన అన్నారు. అంతర్గత కలహాల వల్ల నాలుగు శాతం జీడీపీ కోల్పోతున్నామని పుస్తక రచయిత ప్రకాశ్ సింగ్ అన్నారు. వ్యవస్థాగత రక్షణ లభించినప్పుడే పోలీస్ విభాగం సక్రమంగా పనిచేయగలదని..పోలీస్ సంస్కరణ వల్లనే ఇది సాధ్యమని ఆయన అన్నారు.