తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కేవలం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో బావోజీ మహారాజ్ను దర్శించుకున్న ఆయన, అనంతరం గిరిజన సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.
దశాబ్దాల కాలంగా గిరిజనులు కలలుగన్న “మా తండాలో మా రాజ్యం” నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ మాత్రమేనని హరీష్ రావు గుర్తు చేశారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోని 3,100 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని ఆయన పేర్కొన్నారు. అలాగే, విద్య , ఉద్యోగాల్లో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచడం వల్ల నేడు వేలాది మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత పదవుల్లో స్థిరపడుతున్నారని ఆయన వివరించారు.
Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించి ఊరూరా ఘనంగా నిర్వహించేలా చేసింది తమ ప్రభుత్వమేనని హరీష్ రావు గర్వంగా చెప్పారు. కొత్తపల్లి ప్రాంతంలో రూ. 8 కోట్లతో బ్రిడ్జిని నిర్మించడంతో పాటు, రూ. 50 లక్షలతో బంజారా భవనాన్ని, బావోజీ మహారాజ్ దేవాలయ అభివృద్ధికి రూ. 80 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు ఆయన గుర్తు చేశారు.
Allu Arjun : కౌంట్డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్
పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ 6 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా, వారికి రైతుబంధు, రైతుబీమా వంటి సౌకర్యాలను కల్పించారని హరీష్ రావు తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో లంబాడాలకు కనీసం మంత్రి పదవి కూడా లేదని, గిరిజనులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంగ్రెస్ గాలికొదిలేసిందని, ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు అయ్యాయని ఆయన మండిపడ్డారు.
