Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్ల కేటాయింపు ప్రక్రియకు ప్రజాక్షేత్రంలో విశేష స్పందన లభిస్తోంది. మొత్తం 7,340 ఇళ్లకు గాను ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు రావడం పట్ల ఇళ్ల పట్ల ఉన్న తీవ్ర డిమాండ్ను ప్రతిబింబిస్తోంది. కాగా, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు త్వరపడాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం ఆగస్టు 20 తర్వాత అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం వెల్లడించారు. లాటరీలో ఎంపికైన అర్హులకు రాబోయే ఏడాది కాలంలోనే ఇళ్లను నిర్మించి పూర్తి స్థాయిలో అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు.

