AV Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్.. ‘నిజం కోసం పోరాటం ఆగదు’

  • రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానన్న రంగనాథ్
  • రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు రక్షించామని వెల్లడి
  • ల్యాండ్ మాఫియానే కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణ
  • 63 కంటెంప్ట్ కేసులపై స్పందించిన హైడ్రా కమిషనర్
Ranganth Hydraa

Ranganth Hydraa

హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A కల్పించిన స్ఫూర్తితోనే పని చేస్తున్నానని, చెరువులు, పార్కులు , ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో మార్కెట్‌లో దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించిందని వెల్లడించారు. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టే ధైర్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

రూ. 1.50 లక్షల కోట్ల ఆస్తుల పరిరక్షణ , చెరువుల పునరుద్ధరణ

హైడ్రా చేపట్టిన చర్యల వల్ల నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు భారీ స్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లో నుంచి బయటపడ్డాయని రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించామని అన్నారు.

కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న ల్యాండ్ మాఫియా

ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ ఆరోపించారు. లోతుకుంట ప్రాంతంలో దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన 120 ఎకరాల ప్రభుత్వ భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 2,500 కోట్ల విలువైన, వందల ఏళ్ల నాటి హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ చెట్లను విచ్ఛలవిడిగా నరికివేశారని మండిపడ్డారు. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదు మేరకే హైడ్రా రంగంలోకి దిగిందని, ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన భూమిని చూపిస్తూ తనపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని తెలిపారు.

నాపై ఉన్న 63 కంటెంప్ట్ కేసులు ఆ మాఫియా వేసినవే

తనపై ప్రస్తుతం ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులన్నీ బడా భూకబ్జాదారులు వేసినవేనని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట చెరువును ఆక్రమించాలనుకున్న వ్యక్తి, లోతుకుంటలో వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన బిల్డర్, సామాన్యుల ప్లాట్లు ఆక్రమించి బడా కాంప్లెక్స్‌లు కట్టాలనుకున్న సంధ్యా శ్రీధర్ రావు, వేలాది మంది సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ వేల కోట్ల ఆస్తులు ఆక్రమించిన ముఖీమ్.. వీరందరి అక్రమాలకు అడ్డుపడటమే తాను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని, తనకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

ప్రభుత్వాలు గతంలో, ఇప్పుడు లేదా మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా తన వైపు నుంచి 100 శాతం ఫలితాలు ఇచ్చేలా శ్రమిస్తూనే ఉంటానని ఏవీ రంగనాథ్ తేల్చి చెప్పారు. చట్టపరిధిలోనే బాధ్యతలను నిర్వర్తిస్తూ నగరంలో పర్యావరణాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.