హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులపై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ (ఆస్తి పన్ను) బకాయిల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితిపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ అడుగు వేసింది. ఇందులో భాగంగానే, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం ప్రత్యేక ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) విధానాన్ని ప్రకటించింది.
నగర పరిధిలోని మొత్తం 2,217 ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు అసలు పన్ను , దానికి తోడైన భారీ వడ్డీ, జరిమానాలు (పెనాల్టీలు) కలిపి సుమారు ₹5,864 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. అయితే, తాజా ఓటీఎస్ (OTS) మార్గదర్శకాల ప్రకారం.. ఈ బకాయిలపై ఉన్న వడ్డీ , పెనాల్టీలను ప్రభుత్వం 100 శాతం పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ భారీ వడ్డీ మాఫీ నిర్ణయం వల్ల వందల కోట్ల అదనపు భారం తప్పుతుంది. ఇకపై సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా సంస్థలు కేవలం తమ అసలు పన్ను మొత్తమైన ₹1,686.39 కోట్లను మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఇందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంవత్సరాలుగా ఫైళ్లలోనే మురిగిపోతున్న ఆస్తి పన్ను బకాయిలు ఒకేసారి క్లియర్ కానున్నాయి. దీని ద్వారా జీహెచ్ఎంసీ (GHMC) తో పాటు నగర పరిధిలోని ఇతర మున్సిపల్ సంస్థలకు వందల కోట్ల రూపాయల రాబడి తక్షణమే అందనుంది. ఈ నిధుల రాకతో నగరంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల కల్పనను మరింత వేగవంతం చేసేందుకు మున్సిపల్ అధికారులకు వీలు కలుగుతుంది.
