Telangana Govt: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్ తో దాదాపు 6,729 మంది పైన వేటు పడింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టుపై పని చేస్తున్న వారిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు ఉన్నారు. ఈ లిస్టులో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తో సహా వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్ఎన్ రెడ్డితో పాటు 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చ్ 31వ తేదీలోపు అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించి తొలగించాలని వెల్లడించారు. అయితే, వీరి ప్లేస్ లో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు.
Read Also: Surya Grahan In India : రేపే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. సమయం, వివరాలు ఇవే..
కాగా, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖ పరిధిలోని 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరిని తక్షణమే తొలగిస్తున్నట్లు అందులో స్పష్టం చేశారు. అయితే, ఈ జాబితాలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెప్మా, కుడా, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పని చేస్తున్న విశ్రాంత ఐఏఎస్ లు, ఆర్డీవోలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లతో పాటు పలు క్యాడర్లకు చెందిన అధికారులు సైతం ఉన్నారు. మరోవైపు, విద్యుత్త్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది.