Site icon NTV Telugu

Heatwave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Heatwave

Heatwave

Heatwave in Telugu States: నిప్పుల కొలిమి.. నిప్పుల కుంపటి.. ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలనుందా.. ఉదయం 9 గంటలకు అలా రోడ్డెక్కండి చాలు.. అర్థాలు తెలుసుకోవడమే కాదు.. స్పెల్లింగ్ కూడా రాసేస్తారు. అట్టుంటది మనతోని అని భాస్కరుడు భగ్గుమంటుంటే.. ఇవేం ఎండల్రా నాయనా అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్‌లోనే రోహిణి రేంజ్‌లో సూర్యప్రతాపం కనిపిస్తోంటే.. ఇంకో మూడు నాలుగు రోజులు ఇళ్లల్లోనే ఉండండి అని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెయినీ సీజన్‌లో వానలు దంచికొడుతున్నాయ్ అంటాం కదా.. ఈ సమ్మర్‌లో ఎండ దంచికొడుతోంది అనాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఆరు గంటలకే ప్రజెంట్ సర్ అంటూ అటెండెన్స్ ఇస్తున్న సూర్యుడు.. నిమిష నిమిషానికి నిప్పుల కొలిమిలా మారిపోతున్నాడు. 9 గంటలకే మాడు పగిలే రేంజ్‌లో నిప్పులు కురిపిస్తున్నాడు. పదయ్యే సరికి టెంపరేచర్ సర్రున పెరిగిపోతోంది. ఇంకో అరగంట కాకుండానే.. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు భగభగలుంటున్నాయి.

Read Also: PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్‌ టచ్ అయింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాటలు.. జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి రావొద్దని అధికారులు చెబుతుంటే.. హైరానా పడిపోతున్నారు. మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏపీలో భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతుంటే.. ఇవాళ మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని.. 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డగ్రీల టెంపరేచర్ నమోదయింది. రాబోయే రెండు, మూడు రోజులు.. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 37 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున్న జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Exit mobile version