AP CM Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఒకే వేదికపైకి రాబోతోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. చర్చలకు రావాలని ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదన పై ఇటీవల ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీని (శనివారం) సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇందులో పాల్గొనేందుకు మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఆ హోదాలో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాగత ర్యాలీ నిర్వహించనున్నారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగనుంది.దీనికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ర్యాలీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి పీ అండ్ టీ జంక్షన్- బేగంపేట ఫ్లైఓవర్- ప్రజాభవన్- పంజాగుట్ట ఫ్లైఓవర్- ముఖరంజా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకుంటుంది. కొద్ది నిమిషాల పాటు చంద్రబాబు అక్కడ ఆగనున్నారు. తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్వాగత ర్యాలీ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65కి చేరుకుంటుంది.ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అజ్మీరారాజు నాయక్ దాఖలు చేసిన దరఖాస్తుకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ర్యాలీలో డ్రోన్లు, ఫ్లయింగ్ కెమెరాలు ఉపయోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్