AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్

Aidwa

Aidwa

AIDWA: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సివిల్ సప్లై కార్యాలయం ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లు లక్ష్మి మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, పాఠశాల ఫీజులు నిరంతరం పెరుగుతున్నాయని, దీంతో సామాన్య ప్రజల జీవనం మరింత భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల కారణంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 కోటి 5 లక్షల 42 వేల 188 బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్నాయని, వాటి పరిధిలో 3 కోట్ల 39 లక్షల 96 వేల 239 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం మాత్రమే అందిస్తున్నారని పేర్కొన్నారు.

×
×
Ad

ప్రజల ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే బియ్యంతో పాటు పప్పులు, వంటనూనెలు, మొక్కజొన్నలు, చక్కెర, కారం, పసుపు, జీలకర్ర, పామాయిల్, కొబ్బరి నూనె, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులు వంటి మొత్తం 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల అనేక కుటుంబాలు పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య అధికమవుతోందని మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పోషకాహారం అందక చిన్నారులు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆశలత, కె. నాగలక్ష్మి, పి. శశికళ, వై. వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బట్టుపల్లి అనూరాధతో పాటు లక్ష్మమ్మ, సృజన, నవీన, షాబానా బేగం, మస్తాన్ బీ, ఎం. అరుణ, సంధ్య, ఇందిర, వెంకటమ్మ, కవిత, భవాని తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.