Praja Bhavan: తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం రెండు రోజులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. నేడు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో భేటి కానుంది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్దిక సంఘాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని కోరనుంది.
Read also: Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి-శబరి నదులు
అనంతరం ప్రజాభవన్లో అరవింద్ పనగారియా బృందానికి భట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. ఆతరువాత ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 15వ ఆర్థిక సంఘం కింద జీహెచ్ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక రేపు (11)వ తేదీ ఉదయం 16వ ఆర్థిక సంఘం తిరిగి వెళ్లిపోనుంది. 2025-26 నుంచి 2030-31 మధ్య కాలంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల బదిలీల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయబోయే సిఫార్సులు కీలకం కానున్నాయి. నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి సమర్పించాలి మరియు ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి, దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.
Haryana Elections: కాంగ్రెస్-ఆప్ మధ్య చెడిందా..? ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ..