Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..

  • టిన్ షెడ్‌లో భారీ అక్రమ తయారీ
  • 40 ప్యాకింగ్ మెషీన్లు సీజ్
  • రూ.160 కోట్ల పన్ను ఎగవేత గుట్టురట్టు
  • కీలక నిందితుడి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
Fraud

Fraud

Hyderabad Pan Masala Raid: హైదరాబాద్ శివార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక భారీ పాన్ మసాలా, పొగాకు అక్రమ తయారీ కేంద్రాన్ని సెంట్రల్ జిఎస్‌టి (CGST) హైదరాబాద్ జోన్ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం ఛేదించారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఒక నిర్జన ప్రాంతంలో పెద్ద టిన్ షెడ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ తయారీ యూనిట్‌పై దాడి చేసి కోట్ల రూపాయల విలువైన సరుకుతో పాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

టిన్ షెడ్‌లో తయారీ.. 40 ప్యాకింగ్ యంత్రాలు స్వాధీనం

మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌లో పాన్ మసాలా, సెంటెడ్ జర్దా (పొగాకు) తయారు చేయడానికి సుమారు 56 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడి సమయంలో సరుకును ప్యాక్ చేసేందుకు ఉపయోగిస్తున్న 40 అక్రమ ఎఫ్ఎఫ్ఎస్ (FFS) పౌచ్ ప్యాకింగ్ మెషీన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 5,500 కిలోల ఫినిష్డ్ స్టాక్, రూ. 76 లక్షల విలువైన రెడీ-టు-డిస్పాచ్ సరుకును సీజ్ చేశారు. వీటితో పాటు తయారీకి సిద్ధంగా ఉన్న 2,015 కిలోల పాన్ మసాలా మిశ్రమం, 810 కిలోలRaw పొగాకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.160 కోట్ల GST, సెజ్ ఎగవేత.. ప్యాకింగ్ మెటీరియల్, వాహనాలు సీజ్

ప్రభుత్వానికి చెల్లించాల్సిన జిఎస్‌టి (GST), హెచ్‌ఎస్‌ఎన్‌ఎస్ (HSNS) సెస్‌లతో పాటు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఎగ్గొట్టి ఈ సరుకును మార్కెట్‌లోకి విక్రయిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ అక్రమ తయారీ, దొంగతనంగా సరుకు తరలింపుల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.160 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సరుకు రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను, భారీ స్థాయిలో ఉన్న ప్యాకింగ్ మెటీరియల్‌ను, పలు కీలక పత్రాలను సీజీఎస్‌టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సూత్రధారి అరెస్ట్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఈ అక్రమ తయారీ కేంద్రాన్ని వెనుక ఉండి నడిపిస్తున్న కీలక నిర్వాహకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కుంభకోణంలో మరికొంతమంది భాగస్వాములు ఉండే అవకాశం ఉందనే కోణంలో సీజీఎస్‌టీ అధికారులు విచారణను వేగవంతం చేశారు.