CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు

  • మూడు కార్పొరేషన్లకు కొత్త లోగోలు
  • మూసారాంబాగ్ బ్రిడ్జి పూర్తి
  • బతుకమ్మ కుంటపై సీఎం ఫైర్
  • గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Cm Revanth

Cm Revanth

హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మూసారాంబాగ్‌లో పర్యటించిన సీఎం.. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించారు. జీహెచ్‌ఎంసీ నుంచి రెండు కార్పొరేషన్లను వేరు చేసిన తర్వాత కొత్త లోగోలను రూపొందించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీకి కొత్త లోగోను తీసుకొచ్చారు.

ప్రపంచ నగరంగా హైదరాబాద్‌..

హైదరాబాద్‌ నగరం ఇప్పటికే విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నగరం అభివృద్ధి చెందుతోందని, అయితే అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, పరిపాలనా వ్యవస్థలు కూడా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కోర్‌ అర్బన్‌ రీజియన్‌గా ఏర్పాటు చేసి నగరాన్ని మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మూసారాంబాగ్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి..

అంబర్‌పేట్‌, మూసారాంబాగ్‌ మధ్య బ్రిడ్జిని తమ ప్రభుత్వం నిర్మించి ప్రారంభించిందని సీఎం తెలిపారు. గతంలో చిన్న వర్షం వచ్చినా ఈ ప్రాంతంలో బ్రిడ్జి మునిగిపోయేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.

అంబర్‌పేట్‌లో ప్రభుత్వ కార్యాలయాలపై..

అంబర్‌పేట్‌ పేరుకే నియోజకవర్గంగా ఉందని, ఇక్కడ ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అవసరమైనప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. భవిష్యత్‌లో ప్రజలకు పాలన మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బతుకమ్మ కుంటపై రేవంత్‌ వ్యాఖ్యలు..

గత పదేళ్లలో అంబర్‌పేట్‌లో ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అయినా నిర్మించి ఇచ్చారా అని సీఎం ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసేందుకు కూడా గతంలో సరైన సౌకర్యాలు లేకపోయాయని అన్నారు. బతుకమ్మ కుంటను కబ్జాల నుంచి కాపాడేందుకు హైడ్రా ద్వారా చర్యలు తీసుకుని, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేశామని తెలిపారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని భూములు లాక్కుంటున్నారన్న ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. బతుకమ్మ కుంటను తాను జూబ్లీహిల్స్‌కు తీసుకెళ్లలేదని, అక్కడ లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్లు నిర్మించలేదని అన్నారు. ప్రజల కోసం అభివృద్ధి చేసి ఇచ్చామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంపై విమర్శలు..

తమ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కొందరు ధర్నాలు చేయాలని ప్రయత్నించారని రేవంత్‌ రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయానికి వెళ్లినప్పుడు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని రేవంత్‌ ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి, చివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజలకు మౌలిక వసతులు, మెరుగైన పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.