హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైళ్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్లో సుమారు 20 నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తరచూ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కాగా మెట్రో రైలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో ఇటీవల హైదరాబాద్ మెట్రో దేశంలోనే తొలిసారిగా ఓజోన్ ఆధారిత శానిటైజేషన్ను ట్రైన్ కోచ్లలో ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలమనే నమ్మకాన్ని ప్రయాణికులకు అందిస్తూ.. మూడు పోర్టబల్ ఓజోకేర్ మొబిజోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో రైలు కోచ్లను పరిశుభ్రం చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
