CM Revanth Reddy : హైదరాబాద్‌లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!

  • 250 ఎకరాల్లో భారీ AI డేటా సెంటర్
  • రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
  • 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
  • గ్లోబల్ AI హబ్‌గా హైదరాబాద్
Cm Revanth

Cm Revanth

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం హైపర్ వాల్ట్, భాగస్వామ్య సంస్థలు దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

250 ఎకరాల్లో భారీ క్యాంపస్

హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్‌లకు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్య కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనున్నారు.

రేవంత్‌రెడ్డితో టీసీఎస్ ప్రతినిధుల భేటీ

ఈ ప్రాజెక్టుకు సంబంధించి టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శనివారం సచివాలయంలో సమావేశమైంది. టీసీఎస్ సీఈఓ కే. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, సీఈఓ, ఎండీ దీపేష్ నందా పాల్గొన్నారు. ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

ఏఐపై సీఎం కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు తెలంగాణకే కాకుండా దేశానికి కూడా చారిత్రాత్మకమని అన్నారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్నాయని, ఆ సామర్థ్యం తెలంగాణలో అందుబాటులోకి రావడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమని అన్నారు.

బ్లూ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్

ఏఐ కారణంగా అనేక ఉద్యోగాలు మారుతున్నప్పటికీ బ్లూ కాలర్ ఉద్యోగాలను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. నైపుణ్య శిక్షణతో యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.

ఫ్యూచర్ సిటీకి బలమైన పునాది

ఈ భారీ పెట్టుబడితో ఏఐ, డేటా సెంటర్లతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో పర్యావరణహితంగా క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026 జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం కీలకంగా మారింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధుల మధ్య జరిగిన వరుస చర్చలతో కొద్ది నెలల్లోనే ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. దీంతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మరింత ఊతం లభించింది.