హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రికి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమవ్వడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ దారుణంగా స్తంభించిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఐటీ కారిడార్తో పాటు మిగిలిన జంక్షన్లలో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలో రాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రహదారులపై వెళ్లే వాహనదారులు నీరు నిలిచే ప్రాంతాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. DRF బృందాలు రంగంలోకి దిగి నీటి నిల్వలను తొలగించే చర్యలు చేపడుతున్నాయి.

