Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్

  • 169 దవాఖానలకు ప్రత్యేక అధికారుల నియామకం
  • సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి
  • మంత్రి పొన్నం స్వయంగా తనిఖీలకు సిద్ధం
  • ప్రజాప్రతినిధులకు మంత్రి కీలక సూచనలు
Ponnam

Ponnam

Ponnam Prabhakar : వర్షాకాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని మొత్తం 169 బస్తీ దవాఖానల పనితీరును, అక్కడి వైద్య సేవల నాణ్యతను ఈనెల 10వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక తనిఖీల పర్యవేక్షణను సమన్వయం చేస్తూ.. తానే స్వయంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలాలతో కలిసి రాబోయే రెండు మూడు రోజుల పాటు నగరంలోని పలు ముఖ్యమైన బస్తీ దవాఖానలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

సీజనల్ వ్యాధుల నివారణే ప్రధాన లక్ష్యం

వర్షాకాలంలో విజృంభించే డెంగ్యూ, మలేరియా, గజ్జి, , వివిధ రకాల వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టడమే ఈ ప్రత్యేక పర్యవేక్షణ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో బస్తీ దవాఖానలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. దవాఖానల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విధిగా అందుబాటులో ఉంటూ వచ్చే రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని; తగినన్ని మందుల నిల్వలు, ల్యాబ్ (ప్రయోగశాల) సేవలు, ఆసుపత్రి పరిశుభ్రత, , మౌలిక వసతులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.

ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి

నగరంలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్న బస్తీ దవాఖానలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, , కార్పొరేటర్లు విధిగా సందర్శించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులంతా అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బస్తీ దవాఖానలు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.