ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్లో చీఫ్ జస్టిస్, అతిథులు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మర్రి మొక్కను చీఫ్ జస్టిస్ నాటగా, నేరేడు మొక్కను జస్టిస్ నవీన్ రావు, వేప మొక్కను ఎంపీ సంతోష్ కుమార్లు నాటారు. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ వివరించారు.
పార్క్ లో వాకింగ్ చేసిన చీఫ్ జస్టిస్, అతిథులు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు చాలా బాగున్నాయి అంటూ చీఫ్ జస్టిస్ కితాబిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే మార్గమని, ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ మూడు పీ -పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్ లను విధిగా అనుసరించాలన్నారు.