Site icon NTV Telugu

ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది: ప్రదీప్ రావు


ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ రావు అన్నారు. తెలంగాణ వచ్చినప్పటీ నుంచి సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తెలంగాణ యువత తీవ్ర మనో వేదనకు గురవుతుందని ఆయన అన్నారు. అందుకే ఉద్యోగాలపై మాట తప్పి, మడమ తిప్పిన టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఖరికి నిరసనగా కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ సమస్యపై నవంబర్‌ 12న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రదీప్‌రావు ప్రకటించారు.

6,7 తేదీల్లో జిల్లాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. 8,9 తేదీల్లో అసెంబ్లీ సన్నాహక సమావేశాలను నిర్వహించి దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మనోహార్‌రెడ్డి బండి సంజయ్‌ పాదయాత్రకు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారన్నారు. నవంబర్‌ 21 నుంచి జనవరి 10వరకు 50 రోజుల పాటు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. 16 అసెంబ్లీ నియోజక వర్గాలను కవర్‌ చేసేలా పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో రూట్‌ ఫైనల్‌ చేస్తామన్నారు. 2022 లోనే పాదయాత్ర పూర్తవుతుందన్నారు. 242రోజులు పాదయాత్ర కొనసాగుతుందని ప్రదీప్‌ రావు తెలిపారు.

Exit mobile version