రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ములుగులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలన్నారు.
ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, కేసీఆర్ ఆదేశాల మేరకే ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 40 రోజుల్లో ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ పూర్తిచేస్తామని వెల్లడించారు. అన్ని రకాల పరీక్షలు చేసి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని, వివరాలన్నీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీనిద్వారా రోగికి వైద్యులు వేగంగా సేవలు అందించడానికి అవకాశ ఉంటుందని తెలిపారు. ములుగులో రూ.42 కోట్లతో 250 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు.