Site icon NTV Telugu

Harish Rao : థియేటర్లలో కాదు.. సచివాలయంలోనే ‘సస్పెన్స్ థ్రిల్లర్’ నడుస్తోంది

Harish Rao

Harish Rao

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద ‘సస్పెన్స్ త్రిల్లర్’ సినిమా నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న గందరగోళాన్ని ఆయన ఎండగట్టారు.

సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ఒకవైపు ప్రభుత్వం జీవో (GO) జారీ చేస్తుంటే, మరోవైపు సంబంధిత సినిమాటోగ్రఫీ మంత్రి తనకు ఈ విషయం తెలియదని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. “సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికే తెలియకుండా ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా జరిగిపోతుంది?” అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రికే సమాచారం లేకపోతే, అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరని ఆయన నిలదీశారు.

టికెట్ల పెంపు విషయంలో గతంలో హైకోర్టు ప్రభుత్వానికి మొటికాయలు వేసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి, ప్రజల జేబులకు చిల్లు పెట్టేలా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సోచనీయమని మండిపడ్డారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం లోపించిందని, ఎవరికి వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

సామాన్యుడి వినోదంపై కూడా ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల సగటు సినిమా ప్రేక్షకుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుని, పారదర్శకమైన పాలన అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Rahul Dravid Records: ‘ది వాల్’ ద్రవిడ్ రేర్ రికార్డులు.. ఈ ఐదు ఎవరికీ సాధ్యం కాదేమో?

Exit mobile version