తెలంగాణలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ ఎపిసోడ్ నలుగుతున్న వేళ ప్రోటోకాల్ వివాదం పై మాట్లాడటానికి ఇష్టపడలేదు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంట్లు సంతోషాన్ని కలిగించాయి. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో గవర్నర్ మీడియాతో ముచ్చటించారు. తాజా వివాదంపై ఆమె మాట్లాడడానికి అయిష్టత చూపించారు.
భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. గతంలో గర్భిణులకు పౌష్టికాహారం మరియు వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. చాలా గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీలు పౌష్టికాహారం లోపంతో వుండడం గమనించాం.
చాలా మంది గర్భిణీలకు బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండడం గమనించాం. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్ళు తినడం వల్లే జరిగింది అని గమనించాం. చాలా మంది పౌష్టికాహారం లోపం, రక్తహీనతతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వారందరికీ మెడికల్ క్యాంపు లు పెట్టి వారికి వెరీ హైజీన్ ఉండే కిట్ లను పంపిణీ చేయడం జరిగింది. ముందు ముందు కూడా ఎక్కువగా గిరిజనుల సమస్యలపై రాజ్ భవన్ నుంచి దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.