BC Overseas Education Scheme: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బీసీ సంక్షేమ శాఖ గురువారం జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు స్కాలర్షిప్ను అందించనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించి 30 వరకు స్వీకరించనున్నారు. ప్రతి ఏడాది బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. ప్రతి ఏడాది రెండు విడతల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులకు అందిస్తున్న విదేజీ విద్యానిధిని.. మరికొన్ని దేశాలకు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Read also: PVR: గదర్ 2 సినిమా కంటే 4 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టిన పీవీఆర్.. రికార్డులన్నీ బద్దలు
తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం కింద 2023-24 విద్యాసంవత్సరంలో సెప్టెంబరు(ఫాల్ సీజన్) కాలానికి బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం జారీ చేవారు. దరఖాస్తులను ఈ-పాస్ వెబ్సైట్లో సెప్టెంబరు 1 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్టు తెలిపారు. బీసీ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తు చేసుకోవడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. అభ్యర్థుల వయస్సు 2023 జులై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థుల ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్సైన్సెస్, హ్యుమానిటీస్ డిగ్రీ కోర్సుల్లో 60 శాతం మార్కులు పొందిన వారు అర్హులని ఉత్తర్వులో స్పష్టం చేశారు. విదేశీ యూనివర్సిటీలో ప్రవేశానికి ఆహ్వానం(ఐ-20) (ఆఫరింట్ లెటర్), వీసా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈ-పాస్ వెబ్సైట్ పొందుపర్చినట్టు ఉత్తర్వులో తెలిపారు.