Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!

  • 13 రాష్ట్రాల్లో మెగా దాడులు.. 66 మంది అరెస్ట్
  • ఘోస్ట్ సిమ్‌లతో రూ.101 కోట్ల సైబర్ మోసం బయటపడింది
  • చైనా, దుబాయ్ నుంచి నడిచిన ఇంటర్నేషనల్ స్కామ్ నెట్‌వర్క్
  • మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి
Dot Sim Misuse Warning

Dot Sim Misuse Warning

Ghost SIM Scam: దేశంలో ఎలక్ట్రానిక్ సిమ్ (e-SIM) టెక్నాలజీని వాడుకుంటూ ప్రజల అకౌంట్లను ఖాళీ చేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాల గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నడుస్తున్న ‘ఘోస్ట్ సిమ్‌’ల (Ghost SIMs) నెట్‌వర్క్‌పై దేశవ్యాప్తంగా ఏకంగా 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో భారీ దాడులు (Raids) నిర్వహించారు. ఈ మెగా ఆపరేషన్‌లో పోలీసులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు.

కస్టమర్లకు అసలు తెలియకుండానే వారి పేరు మీద సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తూ, ఆ నంబర్లతో విదేశాల నుండి సైబర్ నేరాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసి మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లీగల్ కాకుండా యాక్టివ్ లో ఉన్న 1194 ఘోస్ట్ సిమ్‌లను ట్రేస్ చేయడంతో పాటు, వారి దగ్గరి నుండి 544 ఫిజికల్ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘోస్ట్ సిమ్ కార్డులను ఉపయోగించి కేటుగాళ్లు ఇప్పటివరకు ఏకంగా రూ. 101.87 కోట్ల మేర సైబర్ మోసాలకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దేశవ్యాప్తంగా నమోదైన దాదాపు 76 కీలక సైబర్ కేసుల్లో ఈ సిమ్ కార్డే మెయిన్ సోర్స్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్స్ సాధారణ కస్టమర్ల బయోమెట్రిక్ డేటాను దుర్వినియోగం చేస్తూ దొంగచాటుగా ఈ-సిమ్ (e-SIM) టెక్నాలజీని యాక్టివేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ సిమ్ డేటాను చైనా, కాంబోడియా, దుబాయ్ లాంటి విదేశాలకు పంపించి, అక్కడ కూర్చొని ఇండియన్ నంబర్లతోనే మనవాళ్లను బురిడీ కొట్టిస్తున్నారు.

ఈ ఘోస్ట్ సిమ్‌ల బ్యాక్‌గ్రౌండ్‌తో మార్కెట్లో రకరకాల స్కామ్‌లు నడుస్తున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫేక్ డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్స్, వాట్సాప్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, సెక్స్‌టార్షన్ (Sextortion) , ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న ఫేక్ ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) గ్యాంగ్స్ అన్నీ ఈ తరహా నంబర్లనే వాడుతున్నట్లు తేలింది. ఈ దందాలో టెలికాం కంపెనీలకు చెందిన పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్ల పాత్ర కూడా పూర్తిగా బహిర్గతమైంది. కేవలం కమీషన్ల కోసం అమాయకుల ఐడీలతో వీరు సిమ్‌లను అక్రమంగా యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ తరహా ఘోస్ట్ సిమ్ స్కామ్‌ల బారిన పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఒక సురక్షితమైన ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరికైనా తమ ఆధార్ లేదా ఐడీ కార్డులపై తమకు తెలియకుండా వేరే నంబర్లు రన్ అవుతున్నాయనే డౌట్ ఉంటే, వెంటనే కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ‘సంచార్ సాథి’ (SANCHAR SAATHI) పోర్టల్‌ లోకి వెళ్లి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ పేరు మీద ఉన్న అన్-అథరైజ్డ్ నంబర్లను గుర్తించి, వాటిని బ్లాక్ చేయాల్సిందిగా అక్కడికక్కడే రిపోర్ట్ చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.