Fish Prasadam 2026 : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8వ తేదీన ప్రారంభం కానున్న ఈ పంపిణీ మహోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లు, మౌలిక వసతులు, భద్రతా చర్యలపై అధికారులకు వారు పలు కీలక సూచనలు చేశారు.
ఈసారి రాత్రి నుంచి ప్రారంభం.. నిరంతరాయంగా పంపిణీ
సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుందని, అయితే ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి మృగశిర కార్తె వస్తుండటంతో పంపిణీ సమయాల్లో మార్పులు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈనెల 8వ తేదీ రాత్రి 9 గంటలకే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని, రాత్రి వేళల్లో వస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మరుసటి రోజు అంటే జూన్ 9వ తేదీ రాత్రి వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వందల సంవత్సరాలుగా ఈ చేప ప్రసాదంపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని, అందుకే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వసతి, ఆహార సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రత్యేక వసతులు
ప్రస్తుతం ఎండలు, ఉక్కపోత ఎక్కువగా ఉన్నందున క్యూలైన్లలో నిల్చునే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా క్యూలైన్ల మధ్యలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా సీపీఆర్ (CPR) బృందాలను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించేందుకు ఫైర్ ఇంజన్ వాహనాలను కూడా గ్రౌండ్స్లో ఉంచాలన్నారు.
భద్రత, పర్యవేక్షణపై కఠిన ఆదేశాలు
క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రులు స్పష్టం చేశారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగతనాలు (పిక్ పాకెట్) జరగకుండా భక్తులకు మైకుల ద్వారా నిరంతరం అవగాహన కల్పించాలని, మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ (SHE Teams) రంగంలోకి దించాలని ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సప్ గ్రూపుల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి, దాని ద్వారా మొత్తం ప్రక్రియను మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

