తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్ తీసుకొచ్చిన సమయంలో భూ రికార్డుల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. అయితే ఆచరణలో మాత్రం అనేక మంది పేద రైతులు తమ భూములకు సంబంధించిన హక్కులు, రికార్డుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.
ధరణి పోర్టల్లో భూమిపై ఎవరు హక్కుదారులో, ఎవరు ఆ భూమిని సాగు చేస్తున్నారో తెలియజేసే ‘కాస్తు’, ‘అనుభవదారి’ కాలమ్స్ను తొలగించడం వల్ల అసలైన సాగుదారులకు సమస్యలు ఏర్పడ్డాయని ఈటల రాజేందర్ అన్నారు. తరతరాలుగా ఒకే భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతుల వద్ద సరైన సేల్ డీడ్లు లేకపోవడంతో ఇప్పుడు తమ హక్కులను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రికార్డుల్లో మార్పులు రావడం, పాత వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు.
దొరల వద్ద ఎట్టి చాకిరీ చేసిన కుటుంబాలు, వారి నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వారు కూడా ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈటల తెలిపారు. తాము సాగు చేస్తున్న భూమిపై పూర్తి స్థాయి హక్కు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన పత్రాలు లేకపోవడం వల్ల పేద రైతులు తమ భూములను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేవాలయ భూముల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, కొందరు వాటిని కబ్జా చేశారని ఈటల ఆరోపించారు.
ధరణి విధానం అమల్లోకి వచ్చిన సమయంలోనే ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై తాను ఆందోళన వ్యక్తం చేశానని ఈటల రాజేందర్ తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విధానం వల్ల పేద రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని భావించానని చెప్పారు. భూమి అనేది పేద రైతులకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, తరతరాలుగా వారి జీవనాధారంగా కొనసాగుతున్న భూమిపై రికార్డుల సమస్యలు తలెత్తితే వారి కుటుంబాలే తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ స్థానంలో ప్రస్తుతం భూ భారతి వ్యవస్థ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో భూ సమస్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ధరణి కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో పేద రైతుల భూ హక్కులు, పాత రెవెన్యూ రికార్డులు, సాగుదారుల వివరాలు వంటి అంశాలపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

