Dubai Road Accident: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన జగిత్యాల జిల్లా బిడ్డలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. దుబాయిలోని ఎమిరేట్స్ రహదారిపై జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఏడుగురు వలస కార్మికులు మృతి చెందగా, వారిలో ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందిన వారు కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. షార్జాలోని ఒక అల్యూమినియం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా విధి నిర్వహణలో భాగంగా మినీ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎమిరేట్స్ హైవేపై ఒక లారీ సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా, వేగంగా వస్తున్న కార్మికుల మినీ బస్సు ఆ వాహనాన్ని వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో జగిత్యాల రూరల్ మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం, తక్కళ్ళపల్లికి చెందిన తిరుపతి గౌడ్, , మెట్పల్లి పట్టణానికి చెందిన అబ్దుల్ రఫీఖ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే దుబాయిలోని భారత కాన్సులేట్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించిన అధికారులు, మృతదేహాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన చట్టపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లిన కుటుంబ యజమానులు ఇలా శవాలై వస్తున్నారనే వార్త వినడంతో జగిత్యాల జిల్లాలోని ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, ప్రభుత్వం త్వరగా స్పందించి మృతదేహాలను రప్పించాలని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాయి.

