వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు లంచం తీసుకుంటూ అనినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు.. పీఎన్ఆర్ సీడ్స్ పేరిట మొక్కల వ్యాపారం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని నర్సరీలకు మొక్కలు సరఫరా చేశారు. ఇందుకు బిల్లులు మంజురు చేయాల్సి ఉండగా.. డీఎఫ్వో బాబ్జీరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో మొక్కల వ్యాపారి నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. నేడు రూ.3 లక్షల లంచం తీసుకొంటుండగా.. అధికారులు రెడ్హ్యాండడ్గా పట్టుకున్నారు. బాబ్జీరావు నుంచి మూడు లక్షలను స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.