అక్కంపేట రచ్చబండలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం రేవంత్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారని, జయశంకర్ సార్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్లు జొడెడ్లలాగా పనిచేశారన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్లో రేవంత్ ఓ పాత్రదారుడని అన్నారు. తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు ఏమాత్రం లేదని మండిపడ్డారు.
రైతు ఉద్యమంలో అమరులైన వారిని కాంగ్రెస్, బీజేపీ నిజంగానే ఆదుకొని ఉంటే.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతు డిక్లరేషన్ అమలు చేయమని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల ప్రత్యామ్నాయం కోసమే అనేక రాష్ట్రాలు కేసిఆర్ను కోరుకుంటున్నాయని చెప్పారు. హనుమకొండ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ను స్మరించుకోవడం కోసమే జిల్లాకు ఆయన పేరు పెట్టామన్నారు. ఈయనతో పాల్గొన్న ఈ ప్రెస్మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్లా ప్రవర్తించాడని, జయశంకర్ సార్ స్వగ్రామానికి వచ్చి లుచ్చా మాటలు మాట్లాడుతున్నారని ధర్మారెడ్డి ఆగ్రహించారు. రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్యే పెద్ద రచ్చ జరిగిందన్నారు. ఆరేళ్ళ క్రితమే కేసీఆర్ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చారన్న ఆయన.. కాంగ్రెస్ పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని తాము పండగ చేశామన్నారు. 5 లక్షల రైతు భీమా 10 రోజుల్లోనే అందిస్తున్నామన్నారు. అక్కంపేట రచ్చబండలో అసలు రైతులే లేరన్నారు. పరకాలలో ఏ గ్రామానికి వచ్చినా, రేవంత్కు చెప్పు దెబ్బలు తప్పవని ధర్మారెడ్డి హెచ్చరించారు.