తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. అయితే తెలంగాణ లో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు సర్కార్. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని సరి అంటూ అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. ఉత్తర్వులు పొడగించలేదు కాబట్టి … ఆంక్షలు లేనట్టే నని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరోవైపు సంక్రాంతి సెలవులు అనంతరం పాఠశాలలు, కాలేజీలు కూడా తెరిచారు. రోడ్లపై రద్దీ కూడా పెరిగింది. కరోనా నిబంధనలు పాఠశాలలు, కాలేజీల కేనా? సామాన్యులకు వ్యాపారులకు ఆంక్షలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో సోమవారం 81,486 కరోనా టెస్టులు చేయగా 2,861 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి. కేసులు ఈవిధంగా నమోదవుతుంటే నిబంధనలు ఎత్తివేయడం సమంజసం కాదంటున్నారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ల ప్రక్రియ కొనసాగుతూనే వుంది. ఆంక్షలు విధిస్తేనే ఈ మహమ్మారి అదుపులో వుంటుందని జనం అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.