CM Revanth Reddy: ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ఎదురుగా వచ్చే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సి.వి.ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇకపై వీఐపీ కాన్వాయ్లు వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు.
వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా నివారించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కేవలం ట్రాఫిక్ విభాగం బాధ్యత మాత్రమే కాదని, శాంతిభద్రతల విభాగం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని డీజీపీ ఆదేశించారు. ఐఎస్డబ్ల్యూ (ISW), సీఎస్డబ్ల్యూ (CSW) విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు ట్రాఫిక్ పరిస్థితిని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉన్నతాధికారులు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
