తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల నుంచి సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు వరకు అన్నీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగినవేనని గుర్తు చేశారు. కేవలం మణులు, మాణిక్యాల కోసం ఎవరూ పోరాడలేదని, ఆత్మగౌరవం కోసమే తిరుగుబాట్లు వచ్చాయని పేర్కొన్నారు.
గ్రూప్-1 ఫలితాలు వచ్చిన సంతోషాన్ని కూడా ప్రతిపక్షాలు ఉండనివ్వలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు. కానీ మీ పక్షాన కోర్టుల్లో మేమే నిలబడి వాదనలు వినిపించాం. న్యాయపరమైన చిక్కులన్నింటినీ ఛేదించి, మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చాం” అని ఆయన అన్నారు. మీరు మా కుటుంబ సభ్యులని, అధికారులమనే అహంకారంతో బాధ్యత మరవద్దని హెచ్చరించారు. ప్రభుత్వానికి అధికారులు కళ్లు, చెవులు వంటివారని, పేదలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత మీపైనే ఉందని గుర్తు చేశారు.
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం అద్భుతం కాదు.. అపహాస్యం
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. “ఉపాధి హామీ కూలీలుగా పనిచేసి మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం రాగానే వారిని విస్మరించడం సరికాదు. అందుకే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక కొత్త బిల్లును తీసుకువస్తున్నాం. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి జీతం నుంచి 15 శాతాన్ని కోత విధించి నేరుగా అమ్మానాన్నల ఖాతాలో వేసేలా చట్టం తెస్తాం” అని స్పష్టం చేశారు.
తెలంగాణ అధికారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సీఎం తెలిపారు. తాను స్వయంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వారితో ఒప్పందం (MoU) చేసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు MCRHRD కి వస్తారని, ఇక్కడే ఉన్నత స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తారని భరోసా ఇచ్చారు. చివరగా అధికారులకు సూచిస్తూ.. “జాయిన్ అయిన రోజు ఎంత నిజాయితీగా, ఉత్సాహంగా ఉన్నారో.. రిటైర్మెంట్ రోజున కూడా అలాగే ఉండాలి. చట్టాలను ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలి తప్ప, ఆపడానికి కాదు” అని హితవు పలికారు.
Netanyahu’s ‘Love Story’: ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని ‘లవ్ స్టోరీ’.. నవ్వు ఆపుకోలేకపోయిన పీఎం మోడీ!
