CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- ఒకేసారి 8,000 మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన
- మహిళా సంఘాలతో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు
- రైస్ మిల్లులు, గోడౌన్లు, మహిళా శక్తి సూపర్ బాజార్లకు గ్రీన్ సిగ్నల్
- 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మహిళా సాధికారత, ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఏకంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో మహిళా భవనాలకు పునాది రాళ్లు వేయడం దేశంలోనే ఒక సంచలన నిర్ణయమని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
ఈ ఉన్నత స్థాయి వర్చువల్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో పాటు కీలక అధికారులు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అపర కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన భారీ రోడ్మ్యాప్ను ప్రకటించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
రాష్ట్ర అభివృద్ధి మహిళల పురోగతితోనే ముడిపడి ఉందని నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం స్పష్టం చేశారు. సాధారణంగా సోలార్ ఎనర్జీ అంటే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలు గుర్తొస్తారని, కానీ తెలంగాణలో మహిళా సంఘాల ద్వారానే 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నామని వెల్లడించారు. అలాగే రిలయన్స్ వంటి సంస్థలు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాలను సైతం ఇకపై మహిళా స్వయం సహాయక సంఘాల చేతుల్లో పెట్టబోతున్నామన్నారు.
మహిళల వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా బ్యాంక్ లింకేజీ లోన్ల పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు అందించామని, సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,390 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. పెద్ద పెద్ద వ్యాపారులు అప్పులు ఎగ్గొట్టి పారిపోతున్న ఈ రోజుల్లో.. మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని నిక్కచ్చిగా చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
మహిళలు కేవలం చిన్న చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం మండలాల్లో రైస్ మిల్లులు, గోడౌన్లు, ప్లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఆడబిడ్డలు ప్రతి గింజకూ జవాబుదారీగా ఉంటారని, అందుకే ఇకపై మిల్లులు, గోడౌన్లలో ధాన్యం స్టాక్స్ పెట్టకుండా, మహిళా సంఘాలే నేరుగా వడ్లు కొనుగోలు చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేస్తామన్నారు.
కార్పొరేట్ మార్కెట్ రంగంలోకి మహిళలను తీసుకెళ్లేందుకు ‘మహిళా శక్తి సూపర్ బాజార్ల’ను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ సూపర్ బాజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుందని, పట్టణ ప్రాంతాల్లో వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకే లీజుకు ఇస్తామని చెప్పారు. ఇవి దేశంలోనే బెస్ట్ సూపర్ బాజార్లుగా, డీమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా క్వాలిటీ వస్తువులతో కస్టమర్లను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు.
గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగపడ్డాయని, కానీ తమ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో కూడా చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామన్నారు. మహిళల అభ్యున్నతిని అడ్డుకోవాలని కొందరు కుట్రలు చేసి, ఉచిత బస్సు ప్రయాణం వద్దంటూ రెచ్చగొట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ఇప్పటివరకు రూ.10 వేల కోట్లను ప్రభుత్వమే సంస్థకు చెల్లించిందని స్పష్టం చేశారు.
మహిళలను బస్సులకు యజమానులను చేయాలనే లక్ష్యంతో 1,000 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నామని, అందులో భాగంగానే జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్ వేదికగా 553 బస్సులను ప్రారంభించబోతున్నామని సీఎం వివరించారు. ఇదే సమయంలో సొంత చెల్లెళ్లను ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ, బయటకు వెళ్లగొట్టబడిన చెల్లెలు ఎలా శాపనార్థాలు పెడుతుందో అందరం చూస్తున్నామన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీస్సులతోనే ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ అల్టిమేట్ టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!