సీఎం కేసీఆర్ ఈమధ్యకాలంలో జిల్లాల పర్యటనలు బాగా చేస్తున్నారు. తాజాగా మరో పర్యటనకు తెరతీశారు. వనపర్తి నుండి “మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని సిఎం కేసిఆర్ ప్రారంభిస్తారు.
నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్టును సీఎం ప్రారంభిస్తారు.వనపర్తి లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వనపర్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు.
ఇంతకుముందే వారం క్రితం సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పలు పథకాలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో జిల్లాల్లో పర్యటనలు ముమ్మరం చేయాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిశాక టీఆర్ఎస్ నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.