జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నెల 30 వరకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నేతలను కలిసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ధాన్యం కొనుగోలుపై కొంత కాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ అవకాశం వచ్చినపుడల్లా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా వివిధ జాతీయస్థాయి నేతలను కలిసి మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ ఈనెల 22న చండీఘడ్ లో పర్యటించి రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
అనంతరం ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఆ తర్వాత ఈనెల 26న మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలవనున్న కేసీఆర్.. ఈనెల 27న బెంగళూరు రానున్న అన్నా హజారేతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.