ఢిల్లీలో టీఆర్ ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. పారా బాయిల్డ్ రైస్ ను కొనలేమని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. 2021-22 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరింది.
రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పారా బాయిల్డ్ రైస్ ను మాత్రం సేకరించలేమని చేతులెత్తేసింది. భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ ను ఇవ్వమని తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. గత ఐదు ఆరు సంవత్సరాల నుండి తెలంగాణా నుండి కేంద్ర పూల్ కింద ధాన్యం సేకరణ అనూహ్యంగా పెరిగింది. రా రైస్ మాత్రమే ఎఫ్ సీఐకి ఇస్తామని 2020 21 సంవత్సరంలోనే తెలంగాణా రాతపూర్వకంగా రాసి ఇచ్చింది.
భవిష్యత్తులో పార్ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కూడా తెలంగాణా ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే భారత ఆహారసంస్థ వద్ద మరో మూడు ఏళ్ళకు సరిపడా పారా బాయిల్డ్ రైస్ నిల్వలు వున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ గణనీయంగా పెంచామన్నారు. ఢిల్లీ దీక్ష సందర్భంగా కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.