CLP leader Bhatti Vikramarka and Minister Errabelli Dayakar criticize each other during Telangana Assembly budget meetings 2022.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే సోమవారం బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు ప్రవేశపెడుతున్న సమయంలో అందోళనకు దిగారని బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ… పాత పాలన బాగోలేదు అనే కదా… తెలంగాణ తెచ్చుకుంది.. దానితో మీరు పోల్చుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ ఏమైందని, గీతా కార్మికుల గురించి ఏం చేస్తున్నారని ఆయన అన్నారు. ధరణి అంటే భయపడే పరిస్థితి వచ్చిందని, ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుడే పని అని, ధరణి తప్పులు హత్యల వరకు వెళ్తున్నాయని, ఎమ్మార్వోలను తగలబెట్టి.. తనను తాను కాల్చుకుని పరిస్థితి వచ్చిందన్నారు.
అంతేకాకుండా వరి వేస్తే ఉరే అనే మాట మానేయండని, సంపద ఉన్న రాష్ట్రం మనదని, కేంద్రం కొనను అంటే.. నేనే కొంటా అని చెప్పాలన్నారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మీ రాష్ట్రాల్లో వరి కొంటున్నారా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో మొక్క జొన్న కొనరు వాళ్ళు వచ్చి ఇక్కడ దొంగతనం గా ఇక్కడ అమ్ముకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో భట్టి.. ఛత్తీస్ ఘడ్ పోదాం రండి ఎర్రబెల్లి.. సీఎం తో మాట్లాడి రండి పోదామంటూ కొద్దీ సేపు అసెంబ్లీలో భట్టి విక్రమార్క వర్సెస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగా వ్యాఖ్యలు నడిచాయి. అ తరువాత భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.