Bhatti Vikramarka : కేవలం దైవభక్తి కోసమే కాకుండా, సమాజంలో మార్పు కోసం విద్యకు , రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రసిద్ధ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారంతా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఉన్నతమైన మార్పులు తీసుకురావచ్చని తాము గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన పిప్పిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గూడెం ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మాట ఇచ్చిన కేవలం 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి, ఈ రోజు భూమి పూజ చేసుకోవడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రూ. 70 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2,216 కోట్లతో వివిధ దేవాలయాలను అభివృద్ధి చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇటీవల సరస్వతీ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించామని, అలాగే రాబోయే గోదావరి పుష్కరాల కోసం కూడా రూ. 802 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒకవైపు దైవభక్తి కోసం నిధులు ఇస్తూనే, మరోవైపు అన్నదాతలను ఆదుకునేందుకు రూ. 74 కోట్ల వ్యయంతో ‘గూడెం లిఫ్ట్ ఇరిగేషన్’ పనులను కూడా చేపడుతున్నామని, దీనివల్ల స్థానిక రైతులకు సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

