NTV Telugu Site icon

Bandi Sanjay : ఉక్రెయిన్ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు టెన్షన్‌ పడొద్దు

ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా తీసుకురావాలని కేంద్ర మంత్రి కార్యాలయానికి ఇప్పటికే లేఖ రాశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎప్పటికప్పుడు విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎవరూ టెన్షన్ పడొద్దని తల్లిదండ్రులను కోరారు. ఉక్రెయిన్ లో ఉన్న 20 వేల మంది భారతీయ విద్యార్థినీ, విద్యార్థులను తరలించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, ఉక్రెయిన్ లో నివసిస్తున్న, విద్యనభ్యసిస్తున్న తెలంగాణ పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? వారిని రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విదేశాంగ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశామని, తెలంగాణ విద్యార్థుల వివరాలు సేకరించేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను సైతం ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ టెన్షన్ పడొద్దని, అక్కడున్న భారతీయులను క్షేమంగా తరలించే బాధ్యత కేంద్రం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. మేం నిరంతరం మాట్లాడుతూనే ఉన్నామని, భారత్ మొదటి నుండి శాంతిని కోరుకునే దేశం. అమెరికాతో శత్రుత్వం లేదు, రష్యాతో ఇబ్బంది లేదు. అన్ని దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగిస్తూ శాంతి వాతావరణం నెలకొల్పడమే భారత్ లక్ష్యమని ఆయన అన్నారు. యుద్దాన్ని భారత్ కోరుకోవడం లేదు. యుద్దం ఆగడానికి అవసరమైన అన్ని దౌత్యపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఏ కూటమికి మద్దతు ఇవ్వడం లేదు. తటస్థ వైఖరి తీసుకుంటున్నాం. అవసరమైతే శాంతి కోసం పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ద ప్రభావం భారత ఆర్దిక వ్యవస్థపై ప్రభావం పడకుండా మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని, పెట్రో ధరలను అదుపు చేయడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.