బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా మందస్తుగా బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు చుట్టుముట్టి బండి సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని.. జేబీఎస్ లో నిరసన చేసి తీరుతామని బండిసంజయ్ అన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా..? అంటూ ట్విటర్ ద్వారా బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా..? అంటూ నిలదీసారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచింది. పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..? అంటూ మండిపడ్డారు.
టీఆర్ఎస్ సర్కారు వచ్చినప్పటి నుంచి 60 శాతం చార్జీలను పెంచింది. పేదలు గరీబ్ రథంగా భావించే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల కేసీఆర్ పేదల ఉసురుపోసుకోక తప్పదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెళ్లట్లేదు, ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది..? అంటూ ప్రశ్నించారు. రేపిస్టులను అరెస్టులు చేయడం చేతకాదు కాని, పోలీసులు బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడించడం ఏంటి..? అని నిప్పులు చెరిగారు.
రాజకీయ పార్టీలు ఇండ్లు ముట్టడించడం చూశాం.. కాని, పోలీసులే ఇలా ఇండ్లను ముట్టడించడం టీఆర్ఎస్ హయాంలోనే చూస్తున్నామని విమర్శించారు. ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో బీజేపీని అడ్డుకోలేరని బండిసంజయ్ ట్విటర్ ద్వారా హెచ్చరించారు.
ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో @BJP4Telangana ఉద్యమాన్ని ఆపలేరు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 10, 2022