భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించి గురువారం ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కల్యాణం టిక్కెట్లను పలు సెక్టార్లలో ఆలయ అధికారులు విక్రయించనున్నారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.150 విలువ గల టిక్కెట్లతో పాటు పట్టాభిషేకం కోసం రూ.వెయ్యి విలువ గల టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
కాగా కరోనాతో గత రెండేళ్లుగా భక్తులు లేకుండానే సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా ఏప్రిల్ 10న కల్యాణ మహోత్సవం, 11న మహా పట్టాభిషేకం జరిపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి గల భక్తులు www.bhadrachalarama.org వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు కావాల్సిన భక్తులు ఆలయ కార్యాలయం పనివేళల్లో 08743-232428 నెంబరులో సంప్రదించవచ్చని సూచించారు.
