Adluri Laxman : హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన యువజన సభపై రాష్ట్ర ప్రభుత్వ విప్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తన సభలో అసలైన నిరుద్యోగులతో కాకుండా, కేవలం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం పేపర్ లీకేజీల పాలనగా మారిందని మండిపడ్డారు. కేటీఆర్ ది పూర్తిగా పాపాల చిట్టా అని, వారి హయాంలో జిరాక్స్ సెంటర్లలో సైతం ప్రభుత్వ ఉద్యోగాల క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న దుస్థితి నెలకొందని ఆరోపించారు. పరీక్షా కేంద్రాల బాధ్యతలను సైతం తమ సొంత బంధువులకు అప్పగించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు.
67,700 మందికి ఉద్యోగాలిచ్చాం.. వాస్తవం కాదా
బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను కేటీఆర్, ఆయన తండ్రి కేసీఆర్, బావ హరీష్ రావు, చెల్లెలు కవిత కలిసి తీవ్రంగా వంచించారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శిల్పకళావేదిక వేదికగా రికార్డు స్థాయిలో 67,700 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాగే ఎల్బీ నగర్ స్టేడియంలో వేలాది మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానిదేనన్నారు. గతంలో యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్ నేతలు, ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సాధకబాధల్లో పాలుపంచుకున్నారా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ యువత పక్షాన నిలబడి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.
మీ ఉనికి గల్లంతవుతుందనే భయంతోనే అబద్ధాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, భవిష్యత్తులో తమ రాజకీయ ఉనికి పూర్తిగా గల్లంతవుతుందనే భయంతోనే కేటీఆర్ పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. సీఎంపై విమర్శలు చేసే ముందు, జైల్లో ఉన్న తన సొంత సోదరి కవిత పెడుతున్న శాపనార్థాలకు, ఆమె మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత తోడబుట్టిన చెల్లెలే శాపనార్థాలు పెట్టే స్థితికి కేటీఆర్ దిగజారారని విమర్శించారు. కేటీఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ యువత, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు.

