NTV Telugu Site icon

రేవంత్‌ ఫైర్‌.. కోవిడ్‌ టైంలో రాత్రి ఒంటి గంట వరకు బార్లకు అనుమతా..?

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్‌ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్‌ షాపులు, స్పెషల్‌ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్‌, ఈవెంట్స్‌, టూరిజం హోటల్స్ కు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఉంటుందని ప్రకటించింది సర్కార్.. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి.. ఇతర రాష్ట్రాలు కోవిడ్‌ను అదుపు చేయడానికి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నాయి.. కానీ, తెలంగాణ ప్రభుత్వం రాత్రి ఒంటి గంట దాకా బార్లకు అనుమతి ఇచ్చింది.. అర్ధరాత్రి 12 గంటల వరకు దాకా వైన్స్ కు అనుమతి ఇవ్వడం ఏంటి? అని ఫైర్‌ అయ్యారు.. ఇక్కడ ప్రాణాలకంటే ఆదాయమే ముఖ్యమా..? అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కాగా, ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతున్న సమయంలో.. కట్టడికి పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.