ముంబై లో త్వరలో పాడ్ ట్యాక్సీలు తీసుకు వస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. కుర్లా బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణా కోసం వీటిని ప్రవేశపెడుతున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. బుల్లెట్ ట్రేన్ ర్వైల్వే స్టేషన్, కొత్త ముంబై మైకోర్టు భవనం నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా రద్దీ ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి పాడ్ ట్యాక్సీలు తీసుకువస్తున్నామని ఆయన అన్నారు.
పాడ్ ట్యాక్సీలు అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పాడ్ ట్యాక్సీ అనేది ఒక పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ యంత్రాంగంలో భాగం. ఇది డ్రైవర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. చూడడానికి అచ్చం మెట్రో లానే ఉంటుంది. కాకపోతే దీని కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాకులు ఉంటాయి. ఆ ట్రాక్ పైనే ఇవి నడుస్తాయి. ఇందులో పరిమితంగానే మనుషులు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
సాధారణంగా టాక్సీలు రోడ్డు పై ప్రయాణిస్తుంటాయి. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ట్రాక్ పై ఒకే పాడ్ టాక్సీ మాత్రమే వెళుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. దీంతో చాలా వేగంగా ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తాయి. ఇవి పెద్ద పెద్ద క్యాంపస్ లలో, పట్టణ కేంద్రాల్లో ఉపయోగించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో 2 నుండి ఆరు గురు ప్రయాణించవచ్చు. విద్యుత్ శక్తితో ఇవి పనిచేయడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. జీపీఎస్, సెన్సార్ల ఆధానంగా ఇవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళతాయి.
