Samsung Launches Certified Re-Newed Program: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో కొత్తగా ‘సర్టిఫైడ్ రీ-న్యూడ్’ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రిఫర్బిష్డ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్లో ఫ్లాగ్షిప్ గెలాక్సీ S25 సిరీస్తో పాటు మిడ్ రేంజ్ వినియోగదారులకు చెందిన గెలాక్సీ A సిరీస్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ కింద అందిస్తున్న అన్ని స్మార్ట్ఫోన్లు పూర్తిస్థాయి పరీక్షలు, సాఫ్ట్వేర్ ధృవీకరణ, పనితీరు తనిఖీల తర్వాత మళ్లీ రీ-న్యూడ్ చేయబడతాయని శాంసంగ్ తెలిపింది. అంతేకాదు కొత్త ఫోన్లకు ఇచ్చే విధంగానే ఒక సంవత్సరం వారంటీ కూడా ఈ ఫోన్లకు అందిస్తున్నారు.
శాంసంగ్ ప్రకారం, ఈ ఫోన్లను పూర్తిగా ఒరిజినల్ శాంసంగ్ పార్ట్స్తోనే మరమ్మతులు చేసి, కొత్త బాక్స్లో ప్యాక్ చేసి అందిస్తున్నారు. బాక్స్లో డేటా కేబుల్, ఈజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఉంటాయి. అలాగే వినియోగదారుల పాత డేటాను పూర్తిగా తొలగించిన తర్వాతే ఫోన్లను మళ్లీ విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకా ముఖ్యంగా ఈ రిఫర్బిష్డ్ ఫోన్లకు తాజా సాఫ్ట్వేర్ అప్డేట్లు అందుబాటులో ఉంటాయని, ఏ నెట్వర్క్ సిమ్కైనా అనుకూలంగా పనిచేస్తాయని శాంసంగ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్లు శాంసంగ్ అధికారిక వెబ్సైట్, శాంసంగ్ షాప్ యాప్లో అందుబాటులో ఉన్నాయి.
మిడ్ రేంజ్ వినియోగదారులకు చెందిన Samsung Galaxy A56 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,749గా నిర్ణయించారు. కొత్త ఫోన్ ధర రూ.44,999. ఇక Samsung Galaxy A36 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ను రూ.23,249కి అందిస్తున్నారు. దీని అసలు ధర రూ.32,999. ఇక మరోవైపు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కలిగిన రిఫర్బిష్డ్ Samsung Galaxy S25 Ultra ధర రూ.97,499గా నిర్ణయించారు. ఇదే ఫోన్ కొత్తది కొనుగోలు చేస్తే రూ.1,29,999 ఖర్చవుతుంది. అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ గల Samsung Galaxy S25 రీ-న్యూడ్ మోడల్ ధర రూ.58,749గా ఉంది. కొత్త ఫోన్ ధర రూ.62,999.
