Microsoft: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4800 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం. పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా ఉద్యోగుల తొలగింపు జరిగిందే వాదన ఉంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు కూడా వరసగా తన ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ హెడ్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన ఒక ఇంటర్నల్ ఈమెయిల్ సంచలనంగా మారింది. దీంతో ఉద్యోగుల్లో భయాలు మరింగా పెరిగాయి.
కేవలం ఏఐ వల్లే ఉద్యోగాలు పోయాయనే వదంతుల నేపథ్యంలో అమీ కోల్మన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఈ రోజు తొలగించబడిన ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయడం లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’’ అని ఆమె తన ఈమెయిల్లో పేర్కొన్నారు. ‘‘మనం పనిచేసే విధానాన్ని ఏఐ మారుస్తోందని కూడా అంతే నిజం. మనం రోజూ చేసే అనేక పనులను ఇప్పుడు ఆటోమేట్ చేయవచ్చు. దీని అర్థం మనమందరం నిరంతరం నేర్చుకోవాలి. కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మారుతున్న పనికి అనుగుణంగా మారాలి’’ అని ఉద్యోగులకు స్పష్టం చేశారు.
4800 మంది ఉద్యగులను తొలగించడం ఒక్కసారి చేసే సర్దుబాటు కాదని అమీ కోల్మన్ స్పష్టం చేశారు. మనం ఈ ప్రయాణం ఆరంభంలోనే ఉన్నామని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని మార్పులను చూస్తామని, రాబోయే నెలల్లో కంపెనీలోని ఇతర విభాగాలు కూడా ఇలాంటి తీవ్రమైన సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని ఈమెయిల్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మైక్రోసాఫ్ట్ సుమారుగా 9100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల 4800 మందికి ఉద్వాసన పలికింది.

