AI Job Fears: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా దూసుకుపోతోందో, అంతేస్థాయిలో ఉద్యోగుల్లో గుబులు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ (Reuters/Ipsos) సర్వే ప్రకారం.. సగానికి పైగా అమెరికన్లు ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు శరవేగంగా అడాప్ట్ చేసుకోవడంపై ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 53 శాతం మంది అమెరికన్లు ఏఐ వల్ల తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ గండం పొంచి ఉందని భయపడుతున్నారు. వయస్సు, లింగం, విద్యార్హతలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల్లోనూ ఈ ఆందోళన సమానంగా విస్తరించి ఉండటం గమనార్హం. కాగా, ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పగా, మరో 10 శాతం మంది సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. దేశవ్యాప్తంగా 4,531 మంది అమెరికన్ వయోజనుల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ నివేదికలో రెండు శాతం అటు ఇటుగా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండవచ్చని రాయిటర్స్ పేర్కొంది.
సర్వేల్లో షాకింగ్ విషయాలు..
ఈ సర్వే ఫలితాలు ఇలా రావడానికి ఇటీవలి కాలంలో పెద్ద కంపెనీల్లో జరిగిన ఉద్యోగాల కోతలే ప్రధాన కారణం. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇంటూయిట్’ (Intuit) తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో ఏకంగా 17 శాతం మందిని లేఆఫ్స్ చేస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు, తమ ప్రధాన దృష్టిని ఏఐ ప్రాజెక్టులపై కేంద్రీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. టెక్ ప్రపంచంలో ఏఐ ప్రభావం ఏ స్థాయిలో ఉందనడానికి గత నెలలో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు పరిణామాల గురించి మాట్లాడుతుండగా, అక్కడి విద్యార్థులు ఆయనను చూసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కేవలం సాధారణ ప్రజలే కాదు, అటు రాజకీయ నాయకులు, ఇటు ఆధ్యాత్మిక గురువు పోప్ లియో XIV సైతం ఏఐ వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. వినోదం, రాజకీయ ప్రచారం, యుద్ధ రంగాలలో ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు భారీగా కనిపిస్తున్నప్పటికీ, అమెరికా మొత్తం జాబ్ మార్కెట్పై దీని ప్రభావం ఎంతవరకు ఉందనేది ఇంకా స్పష్టమవ్వలేదు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాల్లో ఉద్యోగ వృద్ధి బాగానే నమోదువుతోంది.
డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ఆలోచనా విధానాలు ఇవే..
ఇక, ఈ విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ఆలోచనా విధానాల మధ్య ఆసక్తికరమైన రాజకీయ వ్యత్యాసం సైతం బయటపడింది. సాధారణంగా విద్యావంతులు, కాలేజీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉండే డెమొక్రాట్ పార్టీ మద్దతుదారులు ఏఐ విషయంలో ఎక్కువ భయపడుతున్నారు. వారిలో 61 శాతం మంది తమ హోమ్ బడ్జెట్ను ఏఐ దెబ్బతీస్తుందని భావిస్తుండగా, వర్కింగ్ క్లాస్ (కార్మిక వర్గం) ఓటర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న రిపబ్లికన్లలో కేవలం 47 శాతం మంది మాత్రమే ఈ ఆందోళన వ్యక్తం చేశారు. న్యూజెర్సీకి చెందిన 62 ఏళ్ల ఫ్రీలాన్స్ రైటర్ జెన్నిఫర్ షాల్హౌబ్ అనుభవం నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వ అధికారులకు లేఖలు రాసే తన ఉద్యోగాన్ని ఆమె ఇటీవలే కోల్పోయారు. తన ఉద్యోగం పోవడానికి ఏఐ అభివృద్ధే కారణమని ఆమె బలంగా నమ్ముతున్నారు. “ఈ రోజుల్లో కంపెనీలు పని నాణ్యత (quality) కంటే తక్కువ ఖర్చుకే ప్రాధాన్యత ఇస్తున్నాయి, అందుకే మనుషుల స్థానాన్ని ఏఐ సులభంగా ఆక్రమిస్తోంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి 2022లో ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ ‘చాట్జీపీటీ’ (ChatGPT) ని మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఈ ఏఐ విప్లవం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మనుషుల లాగే సమాధానాలు చెప్పగల ఈ చాట్బాట్, ఇంటర్నెట్ సెర్చ్ విధానాన్నే మార్చేసి గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్కు సవాలు విసిరింది. ఆ తర్వాత ‘ఆంత్రోపిక్’ (Anthropic) అనే మరో ఏఐ దిగ్గజం కంప్యూటర్ కోడింగ్ అసిస్టెన్స్ ‘క్లాడ్ కోడ్’ (Claude Code) ద్వారా బిజినెస్ క్లయింట్లలో విపరీతమైన ఆదరణ పొందింది. ఈ రెండు కంపెనీలు తమ షేర్లను పబ్లిక్ మార్కెట్లోకి (IPO) తీసుకురావడానికి ప్రయత్నిస్తుండటంతో వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఏఐ టూల్స్ వినియోగం విద్యావంతుల్లోనే ఎక్కువగా ఉంది. సర్వే ప్రకారం, కాలేజీ గ్రాడ్యుయేట్లలో 50 శాతం మంది తాము క్రమం తప్పకుండా ఏఐని వాడుతున్నామని చెప్పగా, గ్రాడ్యుయేట్లు కాని వారిలో కేవలం 34 శాతం మంది, అలాగే సాధారణ జనాభాలో 40 శాతం మంది మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా, ఒకవైపు వ్యాపారాలు సులభతరం అవుతున్నప్పటికీ, ఏఐ తెస్తున్న మార్పులు సగటు కార్మికుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయనేది వాస్తవం.

