Site icon NTV Telugu

Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

Sanju Samson Csk

Sanju Samson Csk

why Sanju Samson left RR: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అన్ లక్కీ ఫెల్లో అని అన్న అభిమానులే.. ఇప్పుడు హీరో అంటున్నారు. భారత్ టీ20 ప్రపంచ కప్ 2026 భారత్ గెలవడంతో సంజు కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గానూ నిలిచాడు. ప్రపంచ కప్ ముగిసిన నేపథ్యంలో సంజు ఐపీఎల్ 2026పై దృష్టి పెట్టనున్నాడు.

ఐపీఎల్ 2026 వేలం ముందు ట్రేడ్ విధానం ద్వారా సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 ఆరంభం నేపథ్యంలో రాజస్థాన్ జట్టును సంజు ఎందుకు వీడాడనే విషయంపై అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఎంతో ఇచ్చిందని, అక్కడ అతన్ని ఎంతో గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. ‘రాజస్థాన్ రాయల్స్ నా కుమారుడిని రాజులా చూసుకుంది. తలపై కిరీటం మాత్రమే తేడా’ అని విశ్వనాథ్ అన్నారు.

Also Read: AA22 Update: టైటిల్‌, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఏప్రిల్ 8న అంతకుమించి!

రాజస్థాన్ రాయల్స్ జట్టులో కాలక్రమేణా పరిస్థితులు మారాయని శాంసన్ విశ్వనాథ్ తెలిపారు. ‘జట్టులో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ కూడా భవిష్యత్తులో రాయల్స్ కెప్టెన్ కావాలనే ఆశతో ఉన్నారని సంజూ గ్రహించాడు. ఒక రోజు న దగ్గరకు వచ్చి.. ఆర్ఆర్ జట్టులో నా ప్రయాణాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది అని చెప్పాడు. రియాన్ ఇప్పటికే అస్సాం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జైస్వాల్ కూడా ముంబై జట్టుకు కెప్టెన్ కావాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందువల్ల భవిష్యత్తులో సమస్యలు రావడానికి ముందే ఫ్రాంచైజీ నుంచి బయటకు రావడం మంచిదని సంజూ భావించాడు’ అని విశ్వనాథ్ వివరించారు.

‘రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు రావాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత సంజుకు చాలా ప్రాంచైజీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ప్రముఖ ఐపీఎల్ జట్ల నుంచి ఆఫర్లు వచ్చాయి. మొదట్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఆలోచన లేదు. చివరికి పరిస్థితులు అనుకూలించడంతో చెన్నైలో భాగం అయ్యాడు’ అని శాంసన్ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అయన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

Exit mobile version