ఆసియా క్రీడల ట్రయల్స్లో ప్రఖ్యాత భారత రెజ్లర్ వినేష్ ఫోగట్కు బిగ్ షాక్ తగలింది. మరోసారి ఆమెకు నిరాశే మిగిలింది. శనివారం జరిగిన 53 కిలోల మహిళల ఫ్రీస్టైల్ విభాగం సెమీ ఫైనల్లో మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఊహించని షాక్తో ఆసియా క్రీడల నుంచి వెనుదిరిగింది.
విషయం ఏంటంటే.. ఈ ట్రయల్స్కు ఒక రోజు ముందే సుప్రీంకోర్టు ఆమెకు పాల్గొనే అనుమతి ఇవ్వడంతో వినేష్ ఫోగట్ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆమె తిరిగి వచ్చిన తొలి పోటీలోనే సెమీ ఫైనల్లో పరాజయం చెందడం గమనార్హం. ట్రయల్స్లో వినేష్ ప్రారంభం బలంగా కనిపించింది. మొదటి రౌండ్లో జ్యోతి పై 7-1 తేడాతో భారీ విజయం సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో నిషుపై 7-6 తేడాతో కఠిన పోరాటంలో గెలిచి సెమీ ఫైనల్కు చేరుకుంది. కానీ సెమీ ఫైనల్లో మీనాక్షి గోయత్తో జరిగిన హోరాహోరీ పోరులో 4-6 తేడాతో ఓడిపోయింది.
ఒక దశలో స్కోర్ సమం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. కీలక సమయంలో పాయింట్ల వివాదం కారణంగా పరిస్థితి మారిపోయింది. మీనాక్షి గోయత్ తీసుకున్న నిర్ణయంతో రిఫరీ నిర్ణయంపై అభ్యంతరం వెనక్కి తీసుకోవడంతో వినేష్కు అవకాశాలు తగ్గిపోయినట్లు సమాచారం. ఇదే సమయంలో వినేష్ ఫోగట్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)తో కొనసాగుతున్న వివాదం కూడా కీలకంగా మారింది. ట్రయల్స్కు ముందు WFI ఆమెను 53 కిలోల విభాగం నుంచి 50 కిలోల విభాగానికి మార్చినట్లు సమాచారం. ఆమె 53 కిలోల విభాగంలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటికీ.. గతంలో ఒలింపిక్స్లో 50 కిలోల విభాగంలో పోటీపడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు WFI పేర్కొంది.
వినేష్ ఫోగట్పై WFI విధించిన నిబంధనలను ఢిల్లీ హైకోర్టు విమర్శించగా.. ఆమెకు ట్రయల్స్లో పాల్గొనే అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. ఇదిలా ఉండగా.. ట్రయల్స్ రోజున కూడా గందరగోళం నెలకొంది. వర్గాల సమాచారం ప్రకారం.. వినేష్ ఫోగట్ తన బరువు విభాగంపై స్పష్టత ఇవ్వకపోవడంతో WFI నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వినేష్ ఫోగట్ ఆసియా క్రీడల 2026 అర్హత సాధించలేకపోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
