Vaibhav Sooryavanshi Delivers RS 35 Crore Performance in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషభ్ పంత్ ప్రయాణం కీలక మలుపు తిరిగింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన పంత్.. రెండు సీజన్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్లో రూ.15 కోట్లకే తిరిగి చేరాడు. ఈ ట్రేడ్ కేవలం ఒక స్టార్ ఆటగాడి బదిలీ మాత్రమే కాదు.. ఐపీఎల్ మార్కెట్లో ఆటగాళ్ల విలువ, వారి ప్రదర్శనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బయటపెట్టింది.
రూ.27 కోట్లకు న్యాయం ఎక్కడ:
రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగి రావడాన్ని చాలామంది భావోద్వేగ నిర్ణయంగా చూస్తున్నప్పటికీ.. ఆర్థిక కోణంలో చూస్తే ఇది మార్కెట్ కరెక్షన్కు ఓ నిదర్శనంగా నిలిచింది. ఢిల్లీ తరఫున తొమ్మిది సీజన్లు ఆడిన పంత్.. జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అయితే ఎల్ఎస్జీలో రెండు సీజన్లలో అతడి ప్రదర్శన రూ.27 కోట్లకు న్యాయం చేయలేదని అభిప్రాయం క్రికెట్ నిపుణుల్లో ఉంది. అందుకే అతడి మార్కెట్ విలువ దాదాపు రూ.12 కోట్లు తగ్గింది. ఐపీఎల్ 2026 సీజన్లో పంత్ 14 మ్యాచ్ల్లో 312 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్రేట్ 138.05గా నమోదైంది. అత్యధిక స్కోరు 68 పరుగులు. ఈ గణాంకాలు మరీ తీసిపారేసివి కాకపోయినా.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ మొత్తం అదనుకున్న ధరకు ఈ మాత్రం న్యాయం జరగలేదని విశ్లేషణలు అంటున్నారు. రూ.27 కోట్ల ధరకు న్యాయం చేయలేదనే అభిప్రాయం అందరిలో ఉంది.
వైభవ్ విలువపై పెద్ద చర్చ:
రిషభ్ పంత్ ధర తగ్గడం ఒక వైపు అయితే.. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విలువపై పెద్ద చర్చ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ కేవలం రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసిన వైభవ్.. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యదిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 48.50 సగటుతో పాటు 237.31 స్ట్రైక్రేట్ నమోదు చేశాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు బాదిన బుడ్డోడు.. మొత్తం 63 ఫోర్లు, 72 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ కొట్టిన 72 సిక్సర్ల ద్వారానే 432 పరుగులు వచ్చాయి. పవర్ప్లేలో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యాన్ని బేబీ బాస్ చూపించాడు.
ఇంపాక్ట్ స్కోర్ 2490.35:
ఐపీఎల్ 2026లో వైభవ్ ప్రదర్శనను ఆధారంగా తీసుకుని రూపొందించిన కొన్ని విశ్లేషణాత్మక మోడళ్ల ప్రకారం.. బుడ్డోడి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ.34.97 కోట్లుగా అంచనా వేశారు. అంటే రాజస్థాన్ రాయల్స్ కేవలం రూ.1.10 కోట్ల పెట్టుబడితో.. దాదాపు రూ.34 కోట్లకు పైగా విలువైన ప్రదర్శనను పొందిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభావ సూచికల పరంగా కూడా వైభవ్ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం సీజన్ ఇంపాక్ట్ స్కోర్లో రెండో స్థానంలో, బ్యాటింగ్ ఇంపాక్ట్లో మొదటి స్థానంలో నిలిచాడు. అతడి ఫైనల్ ఇంపాక్ట్ స్కోర్ 2490.35గా నమోదవగా.. పంత్ ఇంపాక్ట్ స్కోర్ 905.33 మాత్రమే. అంటే ప్రభావ పరంగా వైభవ్ దాదాపు మూడింతలు మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
వైభవ్ సూర్యవంశీ తోపు:
ఒకవేళ రిషభ్ పంత్ ధర అతడి ప్రదర్శన ఆధారంగా రూ.27 కోట్ల నుంచి రూ.15 కోట్లకు తగ్గితే.. వైభవ్ వంటి ఆటగాడు ఇంకా రూ.1.10 కోట్ల స్థాయిలో ఉండటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో పేరుకన్నా ప్రదర్శనకే విలువ ఇవ్వాలనే భావన బలపడుతున్న తరుణంలో.. వైభవ్ భవిష్యత్ వేలం లేదా ట్రేడ్ మార్కెట్లో భారీ ధర దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గణాంకాలు, ప్రభావం, మ్యాచ్లపై చూపిన ప్రభావాన్ని బట్టి చూస్తే.. ఐపీఎల్లో తదుపరి భారీ మొత్తం బుడ్డోడికే దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసిన ఫాన్స్.. ‘వైభవ్ సూర్యవంశీ తోపు’, ‘ఐపీఎల్ 2026లో బేబీ బాస్ రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్ చేశాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

